రోడ్డుపై లారీలు నిలిపినందుకు అద్దాలు ధ్వంసం

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్టు30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీసులు రెచ్చిపోయారు. రోడ్డుపై నిలిపారంటూ 50 లారీల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. బూర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ పేపర్‌ బోర్డుకు ముడి సరుకులను లారీలు పెద్దఎత్తున తీసుకువచ్చాయి. లారీలతో యార్డు నిండిపోవడంతో మిగిలిన లారీలు రోడ్డు పక్కన నిలిపివేశారు. ట్రాఫిక్‌ కు అంతరాయం కలిగిందన్న కారణంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. మొత్తం 50 లారీల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు.