రోడ్డు ప్రమాదంలో చిన్ననాటి మిత్రుల మృతి

– మినీ బస్సు, ట్రక్కు 13మంది దర్మరణం

ధార్వాడ్‌,జనవరి 15(జనంసాక్షి): సంక్రాంతి పర్వదినం వేళ పెను విషాదం.. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుబ్లీ – ధార్వాడ్‌ రహదారిలో ఇట్టిగట్టి క్రాసింగ్‌ వద్ద మినీ బస్సు, ట్రక్కు ఎదురురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 13 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దేవనగరికి చెందిన వీరంతా గోవాలో ఓ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలను ఎస్పీ కృష్ణకాంత్‌ పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ధార్వాడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఘటనపై ప్రధాని విచారం

ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు.