రోడ్ల దుస్థితిపై కాంగ్రెస్‌ ఆందోళన

జిహెచ్‌ఎంసి ముందు బైఠాయింపు

హైదరాబాద్‌,జూలై18(జ‌నం సాక్షి):హైదరాబాద్‌లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్న పట్టించుకోవడం లేదని, కనీస మరమ్మత్తులు కూడా చేయడం లేదని కాంగ్రెస్‌ మండిపడింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ నేతలు బుధవారం ఆందళనకు దిగారు. నగరంలో రోడ్ల సమస్యతో పాటు పలు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు నినాదాలు చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. దీంతో యూత్‌ కాంగ్రెస్‌ అద్యక్షుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అటు జీహెచ్‌ఎంసీ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్‌ కార్యకర్తలను ఆదర్శ్‌ నగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంజన్‌కుమార్‌ యాదవ్‌, బండ కార్తీకరెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.