లక్ష్యం మేరకు మొక్కల పెంపకం

మహబూబ్‌నగర్‌,జూలై23(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని డీఎఫ్‌వో తెలిపారు. జిల్లాలకు కేటాయించిన హరితహారం లక్ష్యానికి తక్కువ కాకుండా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమం బాధ్యతగా ఉండాలన్నారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సిబ్బంది ప్రభుత్వ దవాఖానల్లో మొక్కలు నాటాలని, పంచాయతీరాజ్‌ వారు గ్రామాల రోడ్ల వెంబడి మొక్కలు నాటాలన్నారు. రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, మొక్కలు ఎక్కువగా నాటే అనువైన ప్రదేశం విశ్వవిద్యాలయాల్లో ఉంటుందన్నారు. అధిక మొక్కలు నాటిన వైస్‌ చాన్సలర్లకు 15లక్షల రివార్డు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. వివిధ నర్సరీలల్లో మొక్కలు అందుబాటులో ఉంచామని, ఈ వర్షాకాలంలో మొక్కలు విధిగా నాటుతామని, ప్రతి గ్రామానికి 40 వేల మొక్కలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. పక్కా ప్రణాళికలు తయారు చేశామని వివరించారు.