లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: పలువురికి గాయాలు

యాదగిరిగుట్ట,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): యాదగిరిగుట్ట మండల పరిధిలోని 163వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి భూపాలపల్లి వైపుగా వెళ్తోంది. రామాజీ పేట వద్దకు రాగానే అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో ఇరు వాహనాల డ్రైవర్లు క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న 20మందిలో 10మందికి గాయాలయ్యాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు విని స్పందించిన స్థానికులు సత్వరమే చికిత్స కోసం వారిని భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలకు దిగారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.