లారీని ఢీకొన్న కారు: చిన్నారి మృతి

నల్లగొండ,జనవరి30(జ‌నంసాక్షి): లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో బాలిక మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాట మండలంలో మండలం వట్టిమర్తి వద్ద జాతీయ రహదారిపై తెల్లవారు జామున జరిగింది. ఎస్‌ఐ జానకిరాములు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన జొన్నల ఉమేష్‌ గుప్తా హైదరాబాద్‌లోని చింతకుంటలో చిన్నపిల్లల ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు. కాగా ఇల్లందులో జరిగిన తన తాత దశదినకర్మకు ఉమేష్‌ కుటుంబసభ్యులతో కలిసి హాజరై తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో మండలంలోని వట్టిమర్తి వద్ద శ్రీషిరిడీ సాయిబాబా ఆలయం సవిూపంలో ఎదురుగా వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కుమార్తె ఉదీప్య, తమ్ముడు ఉషానాథ్‌, భార్య హరితకు గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా ఉదీప్య చికిత్స పొందుతూ మృతిచెందింది. ఉమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.