వంద శాతం ఫిట్‌గా ఉన్నా..

ట్రోఫీతోనే తిరిగొస్తాం!
– ఇంగ్లండ్‌ టూర్‌పై కోహ్లీ
ముంబయి, జూన్‌22(జ‌నం సాక్షి ) : ఇంగ్లండ్‌ టూర్‌ కోసం తాను వంద శాతం ఫిట్‌గా ఉన్నానని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పాడు. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టూర్‌కు బయలుదేరే ముందు కోచ్‌ రవిశాస్త్రితో కలిసి శుక్రవారం విూడియాతో కోహ్లి మాట్లాడాడు. జులై 3 నుంచి ఇంగ్లండ్‌ టూర్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అంతకుముందే ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్‌లో అయిన మెడ గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు ఈ సందర్భంగా విరాట్‌ వెల్లడించాడు. ఇంగ్లండ్‌ టూర్‌కు ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి వెళ్లాలని భావించాను. అయితే పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో వెళ్లలేకపోయాను. 90 శాతం ఫిట్‌గా ఉండి కూడా వెళ్లకపోవడం మంచిదే. ఇప్పుడు నేను 110 శాతం ఫిట్‌గా ఉన్నాను అని కోహ్లి చెప్పాడు. ఇంగ్లండ్‌ టూర్‌కు ముందు కౌంటీ టీమ్‌ తరఫున ఆడాల్సి ఉన్నా.. గాయం కారణంగా కోహ్లి వెళ్లలేకపోయిన విషయం తెలిసిందే. గత ఇంగ్లండ్‌ సిరీస్‌లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. అయితే ఈసారి కూడా టెస్టుల్లో నంబర్‌ వన్‌ టీమ్‌గా ఇంగ్లండ్‌లో అడుగుపెట్టబోతున్నది టీమిండియా. అటు ఇంగ్లండ్‌ వన్డేల్లో నంబర్‌ వన్‌గా ఉంది. దీంతో ఈ రెండు టాప్‌ టీమ్స్‌ మధ్య ఫైట్‌ ఆసక్తికరంగా ఉండనుంది. సొంతగడ్డపై ఆడనుండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చేదే అయినా.. ఆ టీమ్‌కు ఈసారి గట్టి పోటీ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని కోహ్లి, రవిశాస్త్రి స్పష్టంచేశాడు. క్లిష్టమైన క్రికెట్‌ ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. విదేశాల్లో రాణించలేని టీమ్‌గా పేరుంది. దీనిని మార్చాలనుకుంటున్నాం అని కోహ్లి అన్నాడు. ఇంగ్లండ్‌కు వెళ్తున్నది గెలవడానికే. అంతేతప్ప ఏదో సరదాగా వెళ్లి కాఫీలు తాగి వచ్చేయడానికి కాదు. ఫీల్డ్‌లోకి అడుగుపెట్టామంటే సీరియస్‌ క్రికెట్‌ ఆడతాం అని కోహ్లి స్పష్టంచేశాడు.
ఏడాది కాలంగా విరాట్‌ టాప్‌ ఫామ్‌లో ఉన్నా.. ఇంగ్లండ్‌లో పెద్దగా రాణించించి లేదు. గతంలో రెండు టూర్లలోనూ అతను విఫలమయ్యాడు. శనివారం ఐర్లాండ్‌ చేరుకోనున్న టీమిండియా.. ఆ టీమ్‌తో రెండు టీ20లు ఆడిన తర్వాత ఇంగ్లండ్‌ వెళ్లనుంది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టులు ఆడనుంది.