వయాగ్రా కోసం హిమాలయాలకు!

– వారం రోజుల్లో 8మంది మృతి
నేపాల్‌, జూన్‌7(జ‌నంసాక్షి) : హిమాలయ వయాగ్రా కోసం వెళ్లిన 8మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపాల్‌ లోని డోప్లా జిల్లాలో జరిగింది. హిమాలయ వయాగ్రాగా పేరొందిన ‘యార్సాగుంబా’ ఓ అరుదైన వనమూలిక. హిమాలయాల్లో అరుదుగా దొరికే ఎన్నో ఔషధ గుణాలున్న ఈ వనమూలిక ఎంతో ఖరీదైనది. లైంగిక కోరికలను రేకెత్తించడంలో దీనికి సాటి మరొకటి లేదు. అందుకే విదేశాల్లో దీనికి ఎంతో డిమాండ్‌. దీన్ని సేకరించేందుకు 10వేల అడుగుల ఎత్తైన కొండపైకి ఎక్కి వెళ్తుంటారు. అత్యంత ఖరీదైన వయాగ్రాను సేకరించే సమయంలో వారం రోజుల్లో కనీసం ఎనిమిది మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. ఎనిమిది మందిలో ఐదుగురు అనారోగ్యంతో మృతిచెందగా.. మరో ముగ్గురు కొండపై నుంచి జారిపడి మృతిచెందారు. అయితే వీరిలో తల్లితో పాటు ఓ చిన్నారి కూడా అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. ప్రతి వేసవి సీజన్‌ లో నేపాల్‌ ప్రజలు వయాగ్రా సేకరించేందుకు మైళ్ల దూరం నుంచి వస్తుంటారు. ఆసియా, అమెరికా దేశాల్లో ఈ వయాగ్రాను ఒక గ్రామ్‌ ధర 100 యూఎస్‌డి (రూ. 6వేల 937) వరకు పలుకుతుంది. యార్సాగుంబా సేకరించే వారి సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను కూడా స్థానిక అధికారులు ఏర్పాటు చేస్తుంటారు. ఈ వైద్య శిబిరాల్లో డజన్ల కొద్ది మందికి చికిత్స అందించినట్టు అధికారులు తెలిపారు. యార్సాగుంబా అనేది.. గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వాపై పుట్టగొడుగులా పెరిగే ఫంగస్‌. వాయువ్య ఖాట్మాండుకు 600 కిలోవిూటర్ల దూరంలో ఉన్న డోప్లా జిల్లాలో 70కు పైగా పచ్చక బయళ్లలో ఈ యార్సాగుంబా దొరకుతుంది. పసుపు
పచ్చ రంగులో ఉండే ఈ ఫంగస్‌.. బురదలో పెరుగుతుంది. రెండు నుంచి మూడు సెంటీవిూటర్ల పొడుగు
ఉంటుంది. శీతాకాలంలో యార్సాగుంబా పురుగు మాదిరిగా కనిపించే ఈ ఫంగస్‌ వేసవి సీజన్‌ లో చిన్న మొక్కలా కనిపిస్తుంది. బురద నేలలో నుంచి ఈ మొక్కను పీకేందుకు నేపాలీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.