వరికి నీరు తగ్గిన తడులు

ఏలూరు,మార్చి18(జ‌నంసాక్షి): వరికి డెల్టాలో సాగునీటి ఇబ్బందులు తగ్గిపోయాయని  అధికారులు  అంచనాకొచ్చారు. వరికి నీటి అవసరం తగ్గినచోట్ల చేపల చెరువులతో పాటు మంచినీటి చెరువుల్లోనూ నీటి నింపే చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పంటకాలువల ద్వారా ఇస్తున్న నీటిని పొదుపుగా వినియోగించుకునేలా పర్యవేక్షించండని జిల్లా కలెక్టర్‌ సూచించారు.  సాగునీరు అన్ని ప్రాంతాలకు సక్రమమైన పద్ధతిలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.  నిరంతర పర్యవేక్షణతోనే ఇది సాధ్యపడుతుంది. అవసరమైనప్పుడల్లా సీలేరు జలాలు వచ్చేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటామన్నారు. తంలో వంతుల వారీ విధానం అమలు చేసిన ప్రతీ పర్యాయం ఆ వ్యవధిని కొంత పెంచాల్సిన అవసరం తలెత్తగా ఈసారి ముందుగానే సాగునీటి కష్టాలు తీరిపోవడానికి ప్రధాన కారణం వరి విస్తీర్ణం తగ్గిపోవడమేనని రైతులు చెబుతున్నారు. అయితే ముందుగానే చర్యలు  ప్రారంభమవ్వడంతో ఆక్వా రైతులకు కొత్త ఊపిరి వచ్చినట్లయింది.  నీటి చౌర్యానికి పాల్పడ్డారనే అపవాదు నుంచి అధికారికంగానే చెరువుల్లో నీరు నింపుకునే అవకాశం దక్కడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా ఉన్నాయి. మరో పక్షం రోజులు ఇదేరీతిలో సాగునీరు కాల్వలకు విడుదల చేస్తే మంచినీటి చెరువులతో పాటు ఆక్వా చెరువులు జలాలతో నిండుగా కన్పిస్తాయని అంచనా వేస్తున్నారు .గోదావరిలోకి వస్తున్న సీలేరు జలాలు జిల్లాకు పంటలకే
కాకుండా ప్రజలకు మేలు చేస్తున్నాయి. వాస్తవంగా ఈనెలాఖరు వరకూ వంతులవారీ విధానాన్ని అమలు చేసేందుకు తొలుత ప్రణాళికలు సిద్ధం చేశారు. వరికి సాగునీటి అవసరం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నాలుగైదు రోజుల నుంచి ఉండి సబ్‌డివిజన్‌ పరిధిలో చేపలు, రొయ్యల చెరువులను నింపుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.