వారణాసిపై మోదీ వరాల వాన

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 22,(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన నియోజకవర్గమైన వారణాసికి పలు వరాలు ప్రకటించారు. రూ వేయి కోట్ల విలువైన పథకాలను ప్రకటించారు. తాము ప్రాజెక్టులను చేపట్టడమే కాకుండా వాటిని పూర్తిచేస్తామన్నారు. గత ప్రభుత్వాలు కేవలం శంకుస్ధాపనలకే పరిమతమై అభివృద్ధిని విస్మరించాయన్నారు.వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను యూపీ ప్రభుత్వం చేపడుతున్నదని ప్రశంసించారు. వారణాసి ప్రజలకు అండగా నిలిచేందుకు, తాను బరోడా నుంచీ గెలుపొందినా వారణాసి వైపే మొగ్గుచూపానని చెప్పారు. అభివృద్ధితోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని వారణాసిలో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అంతకుముందు చేనేతలకు ఫెసిలిటేషన్‌ సెంటర్‌నూ మోదీ ప్రారంభించారు.