వార్‌ వన్‌ సైడే

– 16పార్లమెంట్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌వే
– ప్రియాంక వచ్చినా దేశానికి ఒరిగేదేవిూ ఉండదు
– సెక్రటేరియట్‌కై డిఫెన్స్‌ ల్యాండ్‌ విషయంలో కేంద్రం సహకరించడం లేదు
– పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం
– తెరాస ఎంపీ కవిత
నిజామాబాద్‌, జనవరి30(జ‌నంసాక్షి) : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడేనని, 16 పార్లమెంట్‌ స్థానాలు టీఆర్‌ఎస్సే కైవసం చేసుకుంటుందని టీఆర్‌ఎస్‌వేనని ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. నవీపేట మండలం పోతాంగల్లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో 80శాతం టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే గెలిచారని తెలిపారు. తెలంగాణ గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంచేసి అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్‌ కల అని ఆమె స్పష్టం చేశారు. కొత్తగా గెలిచిన వారు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ గ్రామాల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు చేపడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 16 పార్లమెంట్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. మరొక సీటు ఎంఐఎం గెలుచుకుంటుందన్నారు.  సెక్రటేరియట్‌లో కోసం డిఫెన్స్‌ ల్యాండ్‌ విషయంలో కేంద్రం సహకరించడం లేదు. ఢిల్లీకి వెళ్తున్నామని, పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలంతా పోరాటం చేస్తామన్నారు. ప్రధాని మోదీని కూడా కలిసి నిలదీస్తాంమని కవిత పేర్కొన్నారు. గరీబీ హఠావో లాంటి కాంగ్రెస్‌ నినాదాలు స్లోగన్స్‌ వరకే మిగిలిపోతున్నాయని అన్నారు. ప్రియాంక గాంధీ వచ్చినా దేశానికి ఒరిగేదేవిూ లేదని అభిప్రాయ పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చేవి నినాదాలు మాత్రమేనని, కాంగ్రెస్‌, బీజేపీ రెండు దొందు దొందే అని కవిత ధ్వజమెత్తారు.  బీజేపీ – కాంగ్రెసేతర పార్టీలు కేంద్రంలో అధికారంలోకి రావాలని కవిత అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఆ రెండు పార్టీలు  చేసిందేవిూ లేదని నిప్పులు చెరిగారు. గల్ఫ్‌ మోసాలు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందన్నారు. నకిలీ ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామని, నకిలీ ఏజెంట్లపై కేంద్రం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఎంపీ కవిత కోరారు.