విజయవాడలో యువతి అదృశ్యం కలకలం

తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
పెళ్లి ఇష్టం లేకే పారిపోయిం ఉంటుందని భావన
విజయవాడ,జూన్‌25(జ‌నం సాక్షి ): విజయవాడలో ఓ యువతి మిస్సింగ్‌ కేసు కలకలం రేపుతోంది. ఐదురోజలుగా తమ కూతరు కనిపించడం లేదని ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చేపట్టారు. వివాహం ఇష్టం లేక యువతి అదృశ్యమైన ఈ సంఘటన విజయవాడలోని సింగ్‌నగర్‌లో చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారి కసర్‌ సింగ్‌ సింగ్‌నగర్‌లో నివాసముంటున్నారు. తన కుమార్తె కిరణ్‌ కౌర్‌(24) గత ఐదు రోజులుగా కనిపించడంలేదని సోమవారం  సింగ్‌ నగర్‌ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఉన్నత విద్యావంతురాలైన తమ కుమార్తెకు ఇటీవల వివాహం చేయాలని నిర్ణయించామని దీంతో కలత చెంది ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐదు రోజులలైనా తమ కుమార్తె ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సింగ్‌నగర్‌ సీఐ జగన్మోహనరావు తెలిపారు. యువతి స్నేహితులని ఆరా తీయగా ఎటువంటి ప్రేమ వ్యవహారం వెలుగు చూడలేదన్నారు. కేవలం వివాహం ఇష్టం లేకే ఇంటి నుంచి వెళ్ళిపోయి ఏదైనా ప్రైవేట్‌ హాస్టల్‌లో తలదాచుకొని ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆమె స్నీహితులను ఇతరులను విచారిస్తున్నారు.