విద్యాహక్కు చట్టాని అమలు చేయాలి

సంగారెడ్డి,జూన్‌20(జ‌నంసాక్షి): జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారని ఎబివిపి నాయకులు  ఆరోపించారు. విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లుపేదలకు కేటాయించాలని, ఫీజు నియంత్రణ కమిటీలు వేసి ఫీజుల దోపిడిని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల కుటుంబాలపై ఫీజుల భారాన్ని మోపుతున్నాయన్నారు. టెక్నో, ఈ-టెక్నో, టాలెంట్‌ అనే పేర్లు ఇప్పటికి కొనసాగిస్తున్నారని అన్నారు.  ప్రైవేటు పాఠశాలపై చర్యలు తీసుకోలేదని, ప్రైవేటు యాజమాన్యాలతో కుమ్మక్కై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారని అన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క పాఠశాలలో విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించలేదని అన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా రుసుము వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు  భర్తీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అధిక రుసుము వసూలు చేస్తున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్య తీసుకోవాలని జిల్లా విద్యాధికారిని కోరారు.