విద్యుత్‌ తీగలకు అన్నదమ్ముల బలి

విద్యుత్‌ శాఖ తీరుపై ప్రజల మండిపాటు

నల్గొండ,జూలై7(జ‌నం సాక్షి): నల్గొండ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై అన్నాదమ్ములు మృతి చెందారు. విద్యుదాఘాతానికి గురైన తమ్ముడిని కాపాడేందుకు వెళ్లిన అన్న సైతం షాక్‌కు గురయ్యాడు. బీటీఎస్‌ ప్రాంతంలోని రహమత్‌ నగర్‌కు చెందిన చేరాల శ్రీనివాస్‌(24), చేరాల ఆనంద్‌(20) ఇద్దరు సోదరులు. శుక్రవారం రాత్రి ఉద్ధృతంగా గాలులు వీచి వర్షం పడటంతో వీరి ఇంటిముందున్న విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. ఇంట్లో నుంచి బయటకి వచ్చిన ఆనంద్‌కు తెగిపడిన విద్యుత్‌ తీగలు తాకాయి. దీంతో అతను ఒక్కసారిగా అక్కడే కుప్పకూలాడు. తమ్ముడిని కాపాడేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్‌ సైతం షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్‌ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని. వాటిని తొలగించాలని గతంలో అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.