విద్యుత్‌ రంగంలో అద్భుత ఫలితాలు

– కేసీఆర్‌ మేధస్సుతోనే ఇది సాధ్యమైంది
– 24గంటల విద్యుత్‌ ఇస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానిదే
– లోవోల్టేజీ సమస్యను అధిగమించాం
– మంత్రి జగదీశ్‌ రెడ్డి
– కోదాడ నియోజకవర్గం శాంతినగర్‌లో సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి
సూర్యాపేట, జులై17(జ‌నం సాక్షి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఉన్న మేధస్సు వల్లే విద్యుత్‌ రంగంలో అద్భుత ఫలితాలు సాధించగలిగామని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. కోదాడ నియోజకవర్గంలోని శాంతినగర్‌లో నూతనంగా నిర్మించిన సబ్‌ స్టేషన్‌ను మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమమే విద్యుత్‌ సమస్య విూదనే మొదలైందన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా విద్యుత్‌ రంగం చర్చనీయాంశమైందని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పడిన కొద్ది రోజులకే విద్యుత్‌ సమస్యను అధిగమించగలిగామని మంత్రి తెలిపారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలంగాణ విద్యుత్‌ రంగం గురించి మాట్లాడుకుంటున్నదని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరా వెనుకాల సీఎం కేసీఆర్‌ కృషి అనిర్వచనీయమైనదని చెప్పారు. లో వోల్టేజీ సమస్యను నివారించడంలో విద్యుత్‌ శాఖ అద్భుత ఫలితాలు సాధించిందని వెల్లడించారు. శాంతినగర్‌లో నిర్మించిన సబ్‌స్టేషన్‌తో ఈ ప్రాంతంలో లో వోల్టేజీ సమస్యను అధిగమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇక్కడ నిర్మించిన సబ్‌స్టేషన్‌తో 3,250 మంది గృహ వినియోగదారులకు, 2,500 మంది వ్యవసాయదారులకు, 120 మంది పారిశ్రామివేత్తలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి జగదీశ్‌ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి, తెరాస నేతలు, అధికారులు పాల్గొన్నారు.