విద్యుత్‌ సమస్య లేకుండా చేసిన ఘనత కెసిఆర్‌దే

సిద్దిపేట,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలు లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఇళ్లకు,వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలని సిఎం నిర్ణయించాక నిరంతరంగా దానిని కొసాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కావాలని ప్రాజెక్టులను నిర్మిస్తుంటే కాంగ్రెస్‌ వారు అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి వారికి ప్రజలు బుద్ది చెప్పాలని అన్నారు. ప్రతి పేదవానికి సొంతిల్లు ఉండాలని డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించిఇస్తోందన్నారు. పేద వాడికి కడుపు నిండ అన్నం అందించేందుకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉన్నా, వారికి బియ్యం అందిస్తుందన్నారు. పేదింటి యువతులకు కల్యాణిలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే రైతుల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని, రైతులకు నేరుగా ఎకరానికి నాలుగు వేల చొప్పున ఆర్థిక సాయం అందించిందని అన్నారు.