విద్యుత్ షాక్‌తో రైతు మృతి

ఆదిలాబాద్,: విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన సంఘటన జిల్లాలోని మామడ మండలం కమల్‌కోట్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు అబ్బడి రాజేశ్వర్‌రెడ్డి బుధవారం రాత్రి పంటకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. స్టార్టర్ ఆన్ చేసినా మోటారు ఆన్ కాకపోవడంతో ఏం జరిగిందో చూద్దామని పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం వద్దకు వెళ్లాడు. అయితే అక్కడ అప్పటికే విద్యుత్ వైరు తెగిపడి ఉంది. దీనిని గమనించని రైతు ఆ వైరుపై కాలుపెట్టాడు. దీంతో వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి పొలానికి వెళ్లిన రాజేశ్వర్‌రెడ్డి తెల్లవారినా ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా అక్కడ విగతజీవిగా పడి ఉన్న రైతును చూసి బోరున విలపించారు. రాజేశ్వర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్ఐ మల్లేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.