విశాఖ భూ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి ధర్మాన
ఆయన తనయుడికీ భాగస్వామ్యం
నివేదిక సమర్పించిన సిట్
అమరావతి,నవంబర్6(జనంసాక్షి): విశాఖలో భూరికార్డుల ట్యాంపరింగ్పై విచారణ జరిపిన సిట్ కేబినెట్కు నివేదిక అందజేసింది. ఆ నివేదికలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు ఉంది. ధర్మానతో పాటు పలువురు అధికారులకు కూడా ఈ భూకుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు సిట్ గుర్తించింది. దీంతో వీరందరిపైనా చర్యలకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. ధర్మాన గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. గత 15 ఏళ్లుగా జరిగిన భూ లావాదేవీలపై సిట్ విచారణ జరిపింది. ధర్మాన కుమారుడి పేరువిూద ఉన్న భూములపైనా ఆరోపణలు ఉన్నాయి. విచారణ జరిపిన సిట్ ఇచ్చిన నివేదికలో ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్ల పేర్లు ఉన్నాయి. 10 మంది డీఆర్వోలు, 14 మంది ఆర్డీవోల పేర్లు ఉన్నాయి. మొత్తంగా 100 మంది అధికారులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ తన నివేదికలో సూచించింది.
ఐఏఎస్, గ్రేడ్-1 స్థాయి అధికారుల ప్రమేయం ఉందని సిట్ నివేదికలో వెల్లడించింది. ఇందులో కొందరు అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే కొన్ని భూముల రిజిస్టేష్రన్ రద్దు చేయాలని సూచించింది. సిట్ నివేదికపై తదుపరి చర్యలకు కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసింది.
భూకుంభకోణంలో గత ప్రభుత్వాల భాగోతం బయటపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ సైనికుల భూముల కొట్టేసిన బడా బాబులకు షాక్ తగిలింది. అప్పటి ఎన్ఓసీల రద్దుకు కేబినెట్ రంగం సిద్ధం చేస్తోంది. భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధం లేదని సిట్ తేల్చింది. కొందరు టీడీపీ నేతలు తక్కువ ధరకు కొన్న దొంగ భూములు.. అసలు యజమానుల పరమయ్యే అవకాశం ఉంది. సీట్ నివేదికతో కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది పీకల దాకా మునిగింది. వీరందరిపై చర్యలకు ప్రభుత్వం సన్నద్దం అవుతోంది. కేబినేట్లో దీనిని చర్చించారు.