వేగంగా ప్రణయ్‌ హత్య కేసు

ఇంకా ఎవరినీ అరెస్ట్‌ చేయలేదన్న ఎస్పీ

నల్గొండ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ప్రణయ్‌ హత్య కేసు విచారణ వేగవంతం చేశామని ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. త్వరలో కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. అయితే ప్రణయ్‌ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత తండ్రి మారుతిరావుతోపాటు హత్య చేసినట్లు అనుమానిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఎస్పీ ఖండించారు. తన కుమారుడి హత్యకు మారుతిరావే ప్రధాన కారణమని ప్రణయ్‌ తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎస్పీ రంగనాథ్‌ కూడా ఈ దారుణం వెనుక అమృత తండ్రే ఉన్నట్లు భావిసున్నామని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామన్నారు. ప్రణయ్‌ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏ-1 నిందితుడిగా మారుతిరావు… ఏ-2 నిందితుడిగా బంధువు శ్రావణ్‌పై కేసు నమోదు చేశారు.