వేర్వేరు ఘటనల్లో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు దుర్మరణం

సంగారెడ్డి,నవంబర్‌16(జ‌నంసాక్షి): వేర్వేరు ఘటనల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు రైతులు కాగా, ఒకరు ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌. సంగారెడ్డి జిల్లాలోని హత్నూర్‌ మండలం చీక్‌మధుర్‌ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు మార్వెల్లి శ్రీశైలం(37), మైలు రవిందర్‌రెడ్డి(35)లు కరెంట్‌ షాక్‌తో మృతి చెందారు. ఘటనా

స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, విద్యుత్‌ అధికారులు విచారణ చేపట్టారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని విద్యుత్‌ శాఖ అధికారులు ప్రకటించారు. ఇదిలావుంటే మెదక్‌ జిల్లాలోని రామయంపేట్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. మంజీరా విద్యాలయంకు చెందిన పాఠశాల బస్సు విద్యుత్‌ వైర్లకు తగిలింది. విద్యార్థులు కిందికి దిగిన తరువాత డ్రైవర్‌ రమేశ్‌కు షాక్‌ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్‌ అధికారులు విచారణ చేపట్టారు. తమ కళ్లముందే రమేశ్‌ మృతి చెందడంతో పిల్లలు భయాందోళనకు గురయ్యారు.