వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో జిహెచ్‌ఎంసి గ్రేట్‌

 

వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తున్నాం

జీడిమెట్లలో రీసైక్లింగ్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం మంచి పరిణామం అని, ఈ విషయంలో హైదరాబాద్‌ ఆదర్శంగా నిలుస్తుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంట్‌ను మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్‌ శనివారం ఉదయం ప్రారంభించారు. రూ. 10 కోట్లతో 500 టీపీడీ సామర్థ్యం కలిగిన రీసైక్లింగ్‌ ప్లాంట్‌ను బల్దియా నిర్మించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ అందాన్ని చెడగొట్టే విధంగా చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ వ్యర్థాలను తొలగించేందుకు బల్దియా శ్రీకారం చుట్టింది. ఆ పక్రియలో భాగంగానే రూ. 10 కోట్లతో కన్‌స్టక్ష్రన్‌ అండ్‌ డిమాలిషింగ్‌ ప్లాంట్‌ను జీడిమెట్లలో ఏర్పాటు చేశామని తెలిపారు. సంక్రాంతి పండుగ రోజు ఎల్బీనగర్‌ ఫతుల్లాగూడలో మరో సీ అండ్‌ డీ ప్లాంట్‌ను ప్రారంభిస్తామన్నారు. వీటితో పాటు రాబోయే రోజుల్లో నగరానికి తూర్పు, పశ్చిమ దిశల్లో

కూడా మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు ఈ ప్లాంట్లు దోహదం చేస్తాయని నమ్ముతున్నానని తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే ఇది అతిపెద్ద ప్లాంట్‌ అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. దేశంలో ఇది ఐదో ప్లాంట్‌ అని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. దీని పరిసరాల్లో ఉండేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సాలిడ్‌ వేస్ట్‌ విషయంలో జీహెచ్‌ఎంసీ చాలా చర్యలు తీసుకుంటుంది. జవహర్‌ నగర్‌కు రోజుకు 6 వేల టన్నుల చెత్తను తరలించి ప్రాసెస్‌ చేస్తున్నామని తెలిపారు. నగరంలో 2 వేల ఎంఎల్‌డీల సివరేజ్‌, డ్రైనేజీ ఉత్పత్తి అవుతుంటే.. 41 శాతాన్ని ఎస్టీపీల ద్వారా శుద్ది చేసి మూసీలోకి వదులుతున్నాం. ఎస్టీపీల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు. సీ అండ్‌ డీ ప్లాంట్‌ ద్వారా బయాలజిక్‌ వేస్ట్‌ అంటే జీవ వ్యర్థాలను పీసీబీ నిబంధనల ప్రకారం.. డిస్పోజ్‌ చేస్తున్నాం. హాస్పిటల్‌, నర్సింగ్‌ ¬ంలలో ఉత్పత్తి అయ్యే బయోమెడికల్‌ వేస్ట్‌ను శాస్త్రీయంగా డిస్పోజ్‌ చేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రతి మున్సిపాలిటీలో మానవ వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ వ్యర్థాల వల్ల ప్రజలకు, పర్యావరణానికి హానికరం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పాలసీలు తీసుకువస్తున్నాం. కాంప్రహెన్షివ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీని కూడా త్వరలో విడుదల చేయబోతున్నాం. క్లీన్‌ టెక్నాలజీలో తెలంగాణ అగ్రభాగాన ఉండాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. స్వచ్ఛ తెలంగాణను తయారు చేయడమే లక్ష్యం. అందుకనుగుణంగా ముందుకెళ్తున్నాం. చెత్తను ఎక్కడి పడితే అక్కడ వేయొద్దు.. ప్రజలు సహకరించాలి. దీంతో భవిష్యత్‌ తరాలకు మెరుగైన హైదరాబాద్‌ను ఇచ్చిన వాళ్లం అవుతామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో రోజుకు 2వేల టన్నుల భవన నిర్మణా వ్యర్థాలు వస్తున్నాయని, చెత్త నుంచి సంపద సృష్టించడం మంచి కాన్సెప్ట్‌ అని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే మరో రెండు ప్లాంట్లను కూడా ప్రారంభిస్తాం అని తెలిపారు. మున్సిపల్‌ వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో జీహెచ్‌ఎంసీ అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. వ్యర్థాలు ప్రజలకు హానికరంగా మారకుండా చర్యలు తీసుకుంటామని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని పేర్కొన్నారు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని, చెత్త తరలింపునకు 180012007669 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.