వైఎస్‌ఆర్‌ బయోఫిక్‌ షురూ!

సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని?
హైదరాబాద్‌, జూన్‌14(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘యాత్ర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో రీల్‌ లైఫ్‌ వైఎస్‌ఆర్‌ పాత్రలో మలయాళీ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటిస్తున్నారు. మహి వి రాఘవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వైస్‌ పాత్రకు సంబంధించిన వివరాలు మినహా ఇతర నటీనటుల వివరాల గురించి చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. కానీ ఎవరెవరు ఏ పాత్రల్లో నటిస్తున్నారో వదంతులు వెలువడుతున్నాయి. ఇందులో వైఎస్‌ కూతురు షర్మిళ పాత్రలో భూమిక, పర్సనల్‌ అసిస్టెంట్‌ సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి నటిస్తున్నారని గతంలో వార్తలు వెలువడ్డాయి. ‘బాహుబలి 2’ ఫేం ఆశ్రిత పొన్నగంటి… వైఎస్‌ సతీమణి విజయమ్మ పాత్రలో నటిస్తున్నారని వదంతులు వినిపించాయి. దీనిపై దర్శకుడు మహి స్పందిస్తూ అందులో నిజం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు వైఎస్‌ హయాంలో ఆంధప్రదేశ్‌ తొలి మహిళా ¬ం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో ప్రముఖ నటి సుహాసిని నటిస్తున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం. సబితా పాత్రలో సుహాసిని సరిగ్గా సరిపోతారని భావించిన చిత్రబృందం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, శశిదేవ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత మమ్ముట్టి తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ఆయన తెలుగులో ఆఖరిగా నటించిన చిత్రం ‘స్వాతి కిరణం’.