వైరా సీటును సిపిఐకి ఇవ్వొద్దు

కాంగ్రెస్‌ నేతల బెదిరింపులు

ఖమ్మం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ బలంగా ఉన్న వైరా సీటును సీపీఐకి కేటాయిస్తే తాము మద్దతివ్వమని వైరా మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సూరంపల్లి రామారావు స్పష్టంచేశారు. మహాకూటమి సీట్ల పొత్తులో సిపిఐ నేతలు వైరా సీటును కోరుతున్నారు. దీంతో ఇక్కడి సీటును కేటాయించవద్దని స్థానిక నేతలు పేచీ పెడుతున్నారు. ఈ సందర్భంగా సూరంపల్లి కొణిజర్లలో మంగళవారం విలేకరులతో

మాట్లాడారు. ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే వైరా సీటు కాంగ్రెస్‌కు ఇవ్వాలని మహాకూటమి నాయకులందరూ నియోజకవర్గంలోని పరిస్థితిని పరిశీలించాలని కోరారు. తప్పదని సీపీఐకే ఇస్తే మాత్రం ఇండిపెండెంట్‌గా తమ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీపీఐ జిల్లా పార్టీకి, టీపీసీసీకి కూడా తెలియజేశామన్నారు. మహాకూటమి నాయకులందరూ ఐక్యంగా ఆలోచించి కాంగ్రెస్‌కు సీటు కేటాయించి.. ప్రత్యర్థి నుంచి గెలిపించుకునేలా కృషిచేయాలని కోరారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఓటు బలంగా ఉందని తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు ఏన్కూరులో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి పేరుతో స్థానిక నేతలకు అన్యాయం చేయడం తగదన్నారు.