వ్యర్థ వస్తువులలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు.
వికారాబాద్ తాండూర్ ఆగస్టు 21 (జనం సాక్షి) వ్యర్థ వస్తువులలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలని
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పేర్కొన్నారు.వికారాబాద్ మండలంలోని పాతూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు శనివారం ఆకస్మికంగా సందర్శించి పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, వైకుంఠదామం నిర్మాణపు పనులను, గ్రామంలో పారిశుధ్య పనులను
పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో ప్రైవేటు స్థలంలో నిర్వహిస్తున్న హరితహారం నర్సరీని పల్లె ప్రకృతివనం లోకి మార్చాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన నీటి సదుపాయం కొరకు బోరు మంజూరు చేయడం జరుగుతుందని సూచించారు. ఒక ఎకరా స్థలంలో గల పల్లె ప్రకృతివనం లో నాటిన మొక్కలు బాగున్నాయని ప్రశంశించారు. ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలు నాటాలని ఆదేశించారు. గ్రామంలో నిర్మించిన డంపింగ్ యార్డ్ డిఆర్ సి సెంటర్ను పరిశీలించారు.  ప్రతిరోజు గ్రామంలో తడి చెత్త పొడి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతుందా లేదా అని సర్పంచ్, గ్రామ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్ కు ముండ్ల మొక్కలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామంలోని వీధులతో పాటు ఇంటింటా తిరిగి పరిశుభ్రత, నీరు నిలువకుండ తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. నిరూపయోగంగా ఉన్న వస్తువులలో వర్షపు నీరు నిలువకుండ చూడాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మలేరియా, డెంగీ తదితర సీజనబుల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు వహించాలని ప్రజలకు సూచించారు.  ప్రతి వారం డ్రైడే గా నిర్వహించాలన్నారు. గ్రామంలో 30 సంవత్సరాలు పైబడిన వారిని గుర్తించి మధుమేహం, హై టెన్షన్ వ్యాధులను గుర్తించి వారికి వైద్య సేవలు అందేటట్లు చూడాలని ఆశా వర్కర్లను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న వైకుంఠదామం పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. దారిలో ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు.అంతకు ముందు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలు  (జాబ్ కార్డు హోల్డర్స్ ) తెలియజేసే రిజిస్టర్ ను, గ్రామ సభలు నిర్వాహంచే రిజిస్టర్, ఇతర రిజిస్యేర్లను పరిశీలించారు.దారిలో వెళుతుండగా హనుమంత్ రెడ్డి అనే యువ రైతును కలెక్టర్ పలకరించి ఈ సారి ఏ పంట వేస్తున్నావని అడుగగా,  రైతు స్పందిస్తూ తన 5 ఎకరాల పొలంలో వాము పంట వేస్తున్నామని రైతు తెలియజేశారు.  ఇంతకు క్రితము పత్తి పంట వేశామని కలెక్టర్ కు తెలియజేశారు.
పంట మార్పిడి వల్ల అధిక లాభాలా వస్తున్నాయని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ డిఓ కృష్ణన్, ఎంపీడీఓ సుభాషిణి, సర్పంచ్ లలితమ్మ, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, గ్రామ కార్యదర్శి సుహాసిని, ఎపిఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు.