వ్యవసాయం దండగన్న వారి నోళ్లు మూతపడ్డాయి

పండగచేసి చూపిన ఘనత సిఎం కెసిఆర్‌దే: సునీత
యాదాద్రి,మే18(జ‌నం సాక్షి ): దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు  సిఎం కెసిఆర్‌ శ్రీకారం చుడుతున్నారని  ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి  అన్నారు. నాణ్యమైన 24 గంటల విద్యుత్‌, ఎరువు లు, విత్తనాలు అందించడంతో పాటు రూ. లక్ష రుణమాఫి, భూ ప్రక్షాళన కోసం నూతన పాస్‌బుక్‌లు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. రైతు బాంధవుడు, రైతుల కష్టాలు తెలిసిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. వ్యవసాయం దండుగ కాదని పండుగని తలపించే విధంగా రైతులకు పంట పెట్టుబడి సాయం రెండు పంటలకు ఎకరాకు రూ.8 వేలు సీఎం అందిసున్నారని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, భూగర్భ జలాలు పెంచడం కోసం మిషన్‌ కాకతీయ వంటి కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలన్నారు. త్వరలో దేవాదుల కాల్వ ద్వారా గుండాల మండలానికి సాగు నీరు అందించే దిశగా ముందుకు వెళుతున్నామన్నారు. ప్రతిపక్షాలు మతిభ్రమించి ఏమి మాట్లాడాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండగా అన్న వారి నోరు మూయించే విధంగా నేడు రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఉచితంగా 24గంటల విద్యుత్‌ అందించడంతో పాటు పెట్టుబడి అందించి రైతుల కష్టాలను తీరుస్తున్నారని అన్నారు.