వ్యవసాయ అభివృద్దికి ప్రణాళిక

పప్పు ధాన్యాల సాగుకు ప్రోత్సాహం

ఆదిలాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాల విభజన అనంతరం వ్యవసాయాభివృద్ధికి అవకాశాలు మరింత మెరుగయ్యాయి. జిల్లాలో అనుకూల పంటల సాగుపై దృష్టి పెట్టడానికి వీలుంది. పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పుదినుసులు సాగు చేసిన రైతులు తిరిగి రబీలో ఆరుతడి పంటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో యాసంగిలో వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్దం చేస్తున్నది. ఆహార పంటలతో పాటు వాణిజ్య, ఉద్యాన పంట సాగు పట్ల రైతులు దృష్టి సారించాలన్నారు. విత్తనోత్తత్పికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్‌ను విత్తనభాండాగారంగా తీర్చిదిద్దవచ్చున్నారు. గతంతో పోలిస్తే పప్పుధాన్యాల ధరలు రెట్టింపు అయింది. ప్రారంభంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూగర్భజలమట్టం పెరిగింది. దీంతో రబీ సాగుపై ఆశలు పెరిగాయి ఖరీఫ్‌లో కొంత నష్టపోయినా.. కొండంత ఆశతో రబీ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్‌లో హాకా, తెలంగాణ విత్తన సంస్థ ఆధ్వర్యంలో 20 వేల హెక్టార్లలో సోయా విత్తనోత్పత్తి జరిగింది. ప్రస్తుతం పంట చేతికి వస్తోంది. శనగ సాగుకు జిల్లా భూములు అనుకూలంగా ఉండటంతో రబీలో శనగ విత్తనోత్పత్తి చేపట్టేందుకు కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఆసక్తి గల రైతులకు మూల విత్తనం సరఫరా చేసేందుకు నిర్ణయించారు. గత ఖరీఫ్‌లో కొంత మంది రైతులు పత్తిని తగ్గించి పప్పుధాన్యాలు వేశారు. అంతర పంటలుగా సోయా, కంది, పెసర, మినుములు, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేశారు. అధిక వర్షాలతో కొంత మంది రైతులకు నష్టం జరిగినా, కొన్ని ప్రాంతాల్లో ఆశించిన దిగుబడులు వచ్చాయి. రబీలో కూడా పప్పుధాన్యాలు సాగు చేస్తే ప్రయోజనం ఉంటుందని భావించి రైతులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకంలో భాగంగా మట్టి నమూనాలు సేకరించి ప్రతి రైతుకు ఫలితాలు అందిస్తున్నాం. వర్షాధార భూముల్లో పది హెక్టార్లకు ఒక నమూనా, అదే నీటి ఆధారిత ప్రాంతాల్లో 2.5 హెక్టార్లకు ఒక మట్టి నమూనా తీసుకుంటున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో పాటు వర్షాలు పుష్కలంగా కురవడంతో సాగునీటికి ఇబ్బంది లేదు. ఈ ఏడాది 30 వేల హెక్టార్లలో సాగు అవుతుందని అంచనా వేశారు. సోయా తర్వాత రైతులు శనగ సాగు చేసే అవకాశం ఉంది. శనగ 10 వేల హెక్టార్లు దాటిందని భావిస్తున్నాం. పంటల సాగు విస్తీర్ణం అంచనా మేరకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక రూపొందించామని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో రాయితీ విత్తన పంపిణీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. విత్తనాల కోసం రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదు.