వ్యాక్సిన్‌ కోసం బలవంతపెట్టం వ్యాక్సి

తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల

హైదరాబాద్‌,జనవరి 15(జనంసాక్షి): వ్యాక్సిన్‌ పనిచేస్తుందా? లేదా? అనే ఆందోళన వద్దు. వాక్సిన్‌ మానవ కల్యాణం కోసమే. భయపడవద్దు. శాస్త్రబద్దంగా అన్ని పరీక్షల తరువాతనే డీసీజీఐ వాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తొలి టీకాను తానే వేయించుకోనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై కొంతమంది సృష్టిస్తున్న వదంతులు, అపోహల నేపథ్యంలో మంత్రి శుక్రవారం మాట్లాడుతూ.. భారత ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వాక్సిన్‌ రేపు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో 139 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో తాను, సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్‌ రెడ్డి పాల్గొంటున్నామన్నారు. రాష్ట్రంలో మిగతా కేంద్రాల్లో స్థానికంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. మొదటి డోసు వేసుకున్న 28 రోజుల తరువాత రెండవ డోసు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డోసులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సిబ్బందికి సరిపోతాయన్నారు. మరిన్ని డోసులు అందిన తర్వాత ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం కోమార్బిడిటీస్‌ ఉన్న వారికి, 50 సంవత్సరాల పైబడిన వారికి వాక్సిన్‌ ఇస్తామన్నారు. భారత్‌ బయోటెక్‌ వాక్సిన్‌ 3వ రౌండ్‌ ట్రయల్స్‌ నిమ్స్‌లో నడుస్తున్నాయి. అవి పూర్తి కాగానే అందుబాటులోకి వస్తుందన్నారు. వాక్సిన్‌ వేసిన తరువాత అరగంట పాటు పరిశీలనలో ఉండాలన్నారు. అందుకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రియాక్షన్స్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్నారు. ఒకవేళ వచ్చినా అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు 57 కేంద్రాలను సిద్దం చేసినట్లు తెలిపారు. ఈ శాఖకు కెప్టెన్‌ను.. సిబ్బంది, ప్రజల్లో ఆత్మవిశ్వాసం కోసం మొదటి టీకా తానే వేయించుకోబోతున్నట్లు చెప్పారు. కోట్ల మందికి ప్రాణదానం చేసిన పెన్సిలిన్‌ సైతం ముందుగా పరీక్ష చేసిన తరువాతనే ఇస్తారు. కాబట్టి భయపడవద్దు. కరోనాను రాష్ట్రం నుండి తరిమికొట్టడానికి అందరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.