శరత్‌ హంతకుడికి కఠిన శిక్ష పడివుంటే బాగుండేది

బంధువుల మనోగతం

వరంగల్‌,జూలై18(జ‌నం సాక్షి): అమెరికాలో శరత్‌ను చంపిన వాడు కఠిన కారాగారా శిక్ష అనుభవించి ఉంటే బాగుండేదని శరత్‌ బంధువుల అభిప్రాయపడ్డారు. శరత్‌ను చంపిన వాడు ఎలా చచ్చాడున్నది ముఖ్యం కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌కు చెందిన శరత్‌ అనే యువకుడు అమెరికాలోని కన్సాస్‌లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. స్థానిక రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న శరత్‌పై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత శరత్‌ను చంపిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. అయితే అతడు చావకుండా జీవితకాల శిక్ష అనుభవించి ఉంటే బాగుండేదన్నారు. హింసకు సమాధానం హింస కాకూడదు. మా అబ్బాయిని చంపిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో చనిపోయినందుకు సంతోషంగా ఉంది. కానీ వాడిని అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టి నరకం అనుభవించేలా చేసి ఉంటే బాగుండేదన్నారు. అమెరికా నుంచి శరత్‌ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం సాయం చేసింది. కానీ ప్రభుత్వ పరంగా ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు రూ.30 లక్షలు ఖర్చు చేశాం.’ అని శరత్‌ బంధువు ప్రసాద్‌ తెలిపారు. శరత్‌ హంతకుడు చనిపోయాడన్న విషయం వార్తల్లో చూసి తెలుసుకున్నాం. అమెరికా అధికారుల నుంచి సమాచారం రావాల్సి ఉందని అన్నారు.