శశికళ సీరియస్‌

– విషమంగా ఆరోగ్యం

బెంగళూరు,జనవరి 22(జనంసాక్షి): శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. బెంగళూరులోని బౌరింగ్‌ ఆసుపత్రిలో ఆమెకు తొలుత రెండుసార్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. ఆ ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ లేకపోవడంతో అక్కడి నుంచి ఆమెను విక్టోరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చేసిన సీటీ స్కాన్‌ పరీక్షలో ఆమెకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో పాటు రక్తపోటు, మధుమేహం సమస్యలు కూడా ఉన్నాయి. శశికళ ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు విక్టోరియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు.శశికళ కారాగార వాసం మరి కొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నెల 27న ఉదయం ఆమె జైలు నుంచి విడుదల కాబోతున్నారని శశికళ తరఫు న్యాయవాది రాజా సెతురపాండియన్‌ ఇటీవల వెల్లడించారు. 2016లో జయలలిత మరణానంతరం అక్రమాస్తుల కేసులో ఆమె అరెస్టయిన విషయం తెలిసిందే. దీంతో నాలుగేళ్లుగా ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.10కోట్లు జరిమానా చెల్లించి ఏడాది ముందుగానే విడుదల కాబోతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న వేళ ఆమె జైలునుంచి విడుదల కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తరుణంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.