శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి –

 ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా
హైదరాబాద్‌, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ప్రకటించారు. అనంతరం గుత్తా సుఖేందర్‌ రెడ్డిని చైర్మన్‌ చైర్‌ వద్దకు మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు విపక్ష సభ్యులు తీసుకెళ్లారు. అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన
సీనియర్‌ నాయకుడు, మూడుసార్లు ఎంపీగా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొన్న సీఎం కేసీఆర్‌.. గుత్తాను మండలి చైర్మన్‌గా ఎంపికచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్‌ నియమితులైన విషయం విదితమే. ఆయన పదవీకాలం ఈ ఏడాది మార్చి 29న ముగిసింది. దీంతో అప్పట్నుంచి తాత్కాలిక చైర్మన్‌గా డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ కొనసాగుతున్నారు. బుధవారమే గుత్తా సుఖేందర్‌ రెడ్డి చైర్మన్‌ గా బాధ్యతలు స్వీకరించారు.