సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ అధికారులు కాచిగూడ స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప¾ండుగను ఘనంగా జరుపుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించడంతో నగరవాసులు తమ స్వగ్రామాలకు వెళ్లడానికి సన్నద్ధమవుతున్నారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలతో పోల్చితే రైలు టికెట్‌ ధరలు చాలా తక్కువగా ఉండటంతో రైలు ప్రయాణానికి నగర ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైళ్లను ఏపీ, బెంగళూర్‌కు నడుపుతున్నారు. ప్రత్యేక రైళ్లతో ప్రయాణికుల రద్దీ తగ్గుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

కాకినాడకు సువిధ స్పెషల్‌
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైళ్లను కాకినాడ పోర్ట్‌, టాటానగర్‌, విశాఖపట్నం, బెంగళూర్‌ కృష్ణరాజపురంనకు నడుపుతున్నారు. దీంతో నగరం నుంచి స్వగ్రామాలకు వెళ్లే నగర ప్రజల వెతలు తీరనున్నాయి.

ఇవి కాకుండా కాచిగూడ నుంచి ప్రతి రోజు తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు పలు ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు ఏపీ, తెలంగాణలోని పలు నగరాలు, పట్టణాలతోపాటు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో కాచిగూడ స్టేషన్‌ నుంచి నిత్యం 40 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. సంక్రాంతి పండుగకు ప్రయాణికుల సంఖ్య 50-60 వేలకు వరకు ఉంటుందని రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.