సన్న ధాన్యం కొనుగోళ్లపై తగ్గిన ఆసక్తి

నిజామాబాద్‌,మే16(జ‌నం సాక్షి): ఈ యేడు నిజాంసాగర్‌ ఆయకట్టు కింద అధిక భాగం గంగాకావేరి సన్నరకం వరి సాగైంది. సన్న ధాన్యం కొనుగోలుకు స్థానిక మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. ఉత్తరప్రదేశ్‌ నుంచి పెద్దఎత్తున ధాన్యం దిగుమతి చేసుకుంటూ స్థానికంగా కొనుగోళ్లు చేయడం లేదు. ఉత్తరప్రదేశ్‌ నుంచి రవాణా ఖర్చులు పోయినా గిట్టుబాటు అవుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. పౌర సరఫరాల శాఖ స్పందించి మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. సన్నరకం వరి ధాన్యాన్ని నెల్లూరు, మిర్యాలగూడ వ్యాపారులు కొనుగోలు చేశారు.  ఈ నేపథ్యంలో రైతులు బయట ప్రాంత వ్యాపారులకు గత్యంతరం లేక సరకు విక్రయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. సరకు కొనుగోళ్లకు సంబంధించి చిన్న చిట్టీలో లారీ నంబరు, వరి ధాన్యం పరిమాణం, తరుగుపోనూ నికర ధాన్యం, క్వింటాలు ధర, ఎంత సొమ్ము రావాలన్నది మాత్రం రాసి స్థానిక కవిూషను ఏజెంట్ల ద్వారా రైతులకు ఇస్తున్నారు. చెల్లింపులకు భద్రత లేకున్నా విధిలేని పరిస్థితుల్లో రైతులు కవిూషను ఏజెంట్లను చూసి ధాన్యం విక్రయిస్తున్నారు. ఇటీవల  వరకూ క్వింటాలు ధర రూ.1350 మించి కొనుగోలు చేయకుండా రైతులను దోచుకున్నారు. అనంతరం నెల్లూరు, మిర్యాలగూడ, కర్ణాటక రాష్ట్రం రాయచూరు, దావణగెర ప్రాంతాల నుంచి వ్యాపారులు రావడంతో ధర  పెరగడం రైతులకు ఊరటనిస్తోంది. అయితే కవిూషను ఏజెంట్లు ఇక్కడ కూడా మాయజాలం చూపి రైతులను మోసం చేస్తున్నారు.