సబ్సిడీ బియ్యం పథకానికి మంగళం పాడాల్సిందే

మారుమూల గ్రామాల్లో సైతం ఇప్పుడు కప్పు చాయ పది రూపాయలు. ధరల విషయంలో పల్లెలకు పట్టణాలకు తేడా లేకుండా పోయింది. సామాన్యులు సైతం పదిరూపాయలు పెట్టి చాయ్‌ తాగుతున్నారు. అలాగే సాయంత్రం అయ్యే సరికి మద్యం షాపులు కిటకిటలాడుతున్నాయి. కూలీనాలీ చేసుకునే వారు కిక్కులేనిదే ఉండడం లేదు. ప్రస్తుతం గ్రామాల్లో కూలీలు దొరకడం కష్టంగా మారింది. వ్యవసాయ కూలీల సంగతి చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రూపాయికే కిలో బియ్యం పథకాన్ని కొనసాగించడం సరికాదు. దీనిని తొలగించడం వల్ల వేలకోట్ల రూపాయల వృధాను అడ్డుకోవచ్చు. ఈ బియ్యం పథకం ప్రభుత్వాలకు గుదిబండగా మారినా గంట కట్టేదెవరన్నది సాహసించడం లేదు. ఓట్లతో ముడిపడి ఉన్న ఈ పథకాన్ని తొలగించాల్సిందే. బియ్యం బదులు నగదుబదిలీ పథకం ఓ రకంగా మంచిదే. దాని బదులు మరే ఇతర పథకమైనా మంచిదే. అంతేగానీ తెలుగు రాష్టాల్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతున్న కిలో రూపాయి బియ్యాన్ని తక్షణం తొలగించడం ద్వారా ప్రజల సొమ్ముకు రక్షణగా నిలవాలి. కిలో రూపాయికే ఇస్తున్న చౌక బియ్యం అక్రమంగా రాష్టాల్ర సరిహద్దులు దాటుతున్నాయి. పేదలు కడుపునిండా తినాలన్న ఈ పథకం ఇప్పుడు కొందరికి వ్యాపారంగా మారింది. మరికొందరికి ఆదాయ వనరుగా మారింది. అలాగే రీసైక్లింగ్‌ పేరుతో సన్నబియ్యంగా మార్చి అమ్ముకునే వ్యాపారంగా మారింది. చెక్‌పోస్టులు,తనిఖీ కేంద్రాలు, పోలీసులు ఉన్నా బియ్యం రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. ఎవరి స్థాయిలో వారికి మామూళ్లు అందు తుండటంతో వ్యాపారం జోరుగా సాగుతోందన్నది కఠోర సత్యం. ఫలితంగా పేదలపేరుతో సర్కార్‌ అందచేస్తున్న బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. ఇక కొందరు ఈ బియ్యాన్ని అమ్ముకుని సన్నబియయం కొనుక్కుని తింటున్నారు. చాలామంది తెల్ల రేషన్‌ కార్డుదారులు ఈ బియ్యాన్ని అమ్ముకోవడానకే ఇష్టపడుతున్నారు. ఇలా రెండు తెలుగు రాష్టాల్ల్రో ఈ పథకం అమలు సంగతి ఎలా ఉన్నా లక్ష్యం మాత్రం నీరుగారుతోంది. తద్వారా ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న నిధులు వృధా అవుతున్నాయి. ఇప్పటికే గ్యాస్‌ సబ్సిడీ తొలగించి నగదు బదిలీ చేపట్టింది కేంద్రం. దీంతో గ్యాస్‌ సబ్సిడీలో కొంతయినా అక్రమాలను అరికట్టగలిగారు. బియ్యం పథకం కోసం సబ్సిడీ రూపంలో వేలకోట్లతో పాటు పెద్ద యంత్రాంగం పనిచేయాల్సి వస్తోంది. ఇలాంటి దుబారాను అరికట్టి నిజమైన పేదలకు లబ్ది చేకూర్చేలా కార్యాచరణ చేయాలి. తెలంగాణ సిఎం కెసిఆర్‌ బియ్యం పథకాన్ని ఎత్తేసే ఆలోచన చేస్తే ఓ రకంగా విప్లవాత్మక సంస్కరణకు ఆయనే ఆద్యుడుగా నిలబడతారు. రూపాయికి విలువ లేని సమయంలో కిలో బియ్యాన్ని అందచేసి అక్రమాలకు తావీయకుండా దీనిని ఎప్పుడో తొలగించాల్సింది. ఆలస్యంగా అయినా దీనిని తొలగించడం మంచిది. ఇక ఎపిలో చంద్రన్న మాల్స్‌ ఏర్పాటుచేయడం ద్వారా సరకులను తక్కువ ధరలకు ఇవ్వాలని చూస్తున్నారు. రైతు బజార్లను పటిస్టం చేసి అక్కడే అన్ని సరకులను తక్కువ ధరలకు అమ్మితే పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసినవారం అవుతాం. అంతేగాని రూపాయికే బియ్యిం ఇచ్చి వృధాను ప్రోత్సహించడం ప్రభుత్వాలకు మంచిది కాదు. నిజంగా ఇరు తెలుగురాష్టాల్ర ప్రభుత్వాలకు ఇది మోయలేని భారంగనే మారింది. అయినా సబ్సిడీ బియ్యాన్ని రూపాయికే కొనసాగించడం సరికాదు. ఉమ్మడి ఎపిలో సబ్సిడీ బియ్యం ధరను పెంచి అక్రమాలను అరికట్టినప్పుడు అప్పట్లో సిఎంగా ఉన్న చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆరోజుల్లోనే ఆయన దీనిని ఐదు రూపాయలకు పెంచారు. కానీ ఇప్పుడు రూపాయికే బియ్యం కావడంతో అక్రమ వ్యాపారానికి తెరతీసారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు బియ్యం సేకరణ తలకు మించిన భారంగా మారింది. జాతీయ భద్రత చట్టం కింద కొంత కేంద్రం సబ్సిడీ బియ్యాన్ని

అందిస్తోంది. మిగిలిన లక్షల కార్డులకు పంపిణీ చేస్తున్న బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ భరించాల్సి వస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం లేవీని పూర్తిగా ఎత్తేసింది. సబ్సిడీ బియ్యం పథకం పక్కాగా అమలు చేసేందుకు ఆన్‌లైన్‌ పద్దతి తీసుకుని వచ్చారు. ఎక్కడి నుంచయినా రేషన్‌ తీసుకునే ఏర్పాట్లు చేశారు. అలాగే జిపిఎస్‌ విధానం అమలవుతోంది. అడపాదపడా దాడులు చేస్తున్నారు. ఆధార్‌ అనుసంధానంతో వేలదిగా బోగస్‌ కార్డులు బయటపడ్డాయి. ఇన్ని చర్యలు తీసుకున్నా అక్రమాలు ఆగడం లేదన్నది అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీంతో మరింత పక్కాగా దీనిని అమలు చేయాల్సిన విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాయి. ఇదిలావుంటే గ్యాస్‌ సబ్సిడీ వదులుకోవాలంటూ వినియోగ దారులపై కేంద్ర సర్కారు ఒత్తిడి తెచ్చిన విధంగానే తెల్లకార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం మంచిది. సంక్షేమ పథకాలకు రేషన్‌ బియ్యానికి లంకె పెట్టడం ద్వారా కంట్రోల్‌ చేయాలన్న ఆలోచన కూడా చేస్తోందని సమాచారం. అన్ని సంక్షేమ పథకాలు పొందుతున్న వారికి రేషన్‌ బియ్యిం అందించడం సరికాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పథకాలు కావాలంటే తెల్లరేషన్‌కార్డుపై సరఫరా చేసే బియ్యంను వదులుకోవాలని లబ్ధిదారులకు షరతు విధించడం వల్ల అక్రమాలకు చెక్‌ పెట్టవచ్చు. సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకే ప్రభుత్వాలు కఠిన నిర్ణయానికి రావాలి. సబ్సిడీ బియ్యం భారం ప్రజలకు కూడా గుదిబండగానే మారిందని గుర్తించాలి. దీంతో అనేక అభివృద్ది కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. దీనిని మరింత పక్కాగా అమలు చేస్తే కొంతయినా అవినీతిని అరికట్టవచ్చని నిపుణులు సైతం సూచిస్తున్నారు. కెసిఆర్‌ ఆలోచనా తీరు అమల్లోకి వస్తేనే మంచిది. పేదలకు అనేక పథకాలు అమలు చే/-తున్న క్రమంలో దుబారాను అరికట్టాల్సిన అసవరం కూడా ఉంది. ఈ సాహసోపేత నిర్ణయానికి తెలుగు రాష్టాల్ర సిఎంలు చొరవ తీసుకోవాలి. సబ్సిడీ బియ్యం పథకానికి మంగళం పాడడం ద్వారా దుబారాకు అడ్డుకట్ట వేయాలి.