సముద్రంలో 26మంది అమ్మాయిల మృతదేహాలు 

– సముద్రంలో రెక్కీనిర్వహిస్తుండగా గుర్తించిన అధికారులు
ఇటలీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): మధ్యదరా సముద్రంలో 26 మంది అమ్మాయిల మృతదేహాలను ఇటలీ అధికారులు గుర్తించారు. సముద్రంలో రెక్కీ నిర్వహిస్తుండగా.. ఈ మృతదేహాలు తేలుతూ కన్పించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక సిబ్బంది సాయంతో గాలించి మృతదేహాలను వెలికితీశారు. వీరి వయసు 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉండొచ్చని చెప్పారు. నైజర్‌, నైజీరియా దేశాలకు చెందిన వలసదారులు అయి ఉంటారని భావిస్తున్నారు.మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లిబియా నుంచి ఓడలో యూరప్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. లుబియాలో అమ్మాయిల అక్రమ రవాణా ఎక్కువగా ఉంటుంది. వివిధ దేశాల నుంచి ఇక్కడకు అమ్మాయిలను తీసుకొచ్చి వారిని లైంగికంగా వేధిస్తుంటారు. ఆ నరకం నుంచి తప్పించుకునేందుకు కొందరు అమ్మాయిలు ఇలా ప్రమాదకరంగా సముద్రాన్ని దాటే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోతున్నారని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది అమ్మాయిలను సహాయ సిబ్బంది రక్షించారు.