సానియా అప్పగింతపై కోర్టులో పిటిషన్‌

రంగారెడ్డి: భార్యను అతికిరాతంగా నరికి, దహనం చేసేందుకు యత్నించి పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు రూపేశ్‌ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. రూపేశ్‌ కస్టడీకి సంబంధించి కోర్టు రేపు ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీరి కుమార్తె చిన్నారి సానియా ఎవరి వద్ద ఉండాలనే దానిపై రాజేంద్రనగర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సానియాను తనకు అప్పగించాలంటూ ఆమె నానమ్మ లలితాదేవి పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే సానియాను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి అప్పగించాలని సీసీఎస్‌ పోలీసులకు ఆదేశాలు అందాయి. కాలిపోయిన సింథియా మృతదేహం నిర్ధారణ కోసం చిన్నారికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగో రాయబారి బ్రిగెట్టి, సింథియా సోదరుడు రాజేంద్రనగర్‌ కోర్టుకు హాజరయ్యారు. సానియాను చూసేందుకు అనుమతి ఇవ్వాలని వారు కోర్టును కోరారు.