సింగరేణిపై పట్టుకోసం బిజెపి నేతల నజర్‌

కార్మిక సంఘం బలోపేతం కోసం ప్లాన్‌
వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న నేతలు
ప్రతివ్యూహంతో సాగుతున్న టిఆర్‌ఎస్‌ నాయకులు
కొత్తగూడెం,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతంగా సింగరేణిపై బిజెపి దృష్టి సారించింది.
తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి పరిధిలో పట్టుకోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతం వెంట విస్తరించి ఉన్న కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పట్టు సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగా సింగరేణి కంపెనీలో పనిచేస్తున్న సుమారు 50వేల మంది పర్మనెంట్‌ ఉద్యోగులను, 25 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులను ఆకర్షించడం ద్వారా ఈ ప్రాంతం విస్తరించి ఉన్న 11 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పట్టు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశిరచుకున్నట్లు తెలుస్తోంది.  సింగరేణిని నష్టాల్లో ముంచారని బిజెపి పదేపదే విమర్శలు చేస్తోంది. సింగరేణిలో పట్టుకోసం బీజేపీ చేపట్టిన  వ్యూహం అధికార టీఆర్‌ఎస్‌ నాయకులను కలవరపెడుతోంది. సింగరేణి పరిధిలో పార్టీ బలోపేతం బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పార్టీ జాతీయ నాయకత్వం అప్పగించినట్లు సమాచారం. సింగరేణిలో గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో కార్మిక క్షేత్రంగా ఉన్న ఆరు జిల్లాల నేతలతో కిషన్‌రెడ్డి టచ్‌లో ఉంటూ బీఎంఎస్‌  బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీల అనుబంధ కార్మిక సంఘాల నుంచి బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతు న్నాయి. పెద్దపల్లి,
మంచిర్యాల జిల్లాల్లోని సింగరేణి కార్మికులతో సంబంధాలు గల మాజీ ఎంపీ గడ్డం వివేక్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ యపార్టీలో పెద్ద ఎత్తున కూడా చేర్చుకున్నారు. ఆయా నియోజకవర్గాల నేతలు సింగరేణి కార్మికులను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. మరోవైపు టిఆర్‌ఎస్‌ కూడా మునుపటి పట్టుకోసంయత్రాలు చేస్తోంది. ఇప్పటికే బెల్లంపల్లి రీజియన్‌లోని శ్రీరాంపూర్‌ ఏరియాలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు గనులపై పర్యటించి తామున్నామంటూ భరోసా
ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వనమా వెంకటేశ్వరరావు గనులపై సమావేశాలు నిర్వహిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతుగా కృషి చేస్తున్నామని హావిూ ఇస్తున్నారు. రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కార్మిక సంఘాల నాయకులతో చర్చిస్తున్నారు. బీఎంఎస్‌లోని టీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌కు చెందిన ముఖ్య నేతలతో పాటు కార్మికులెవరూ వెళ్లకుండా కట్టడిచేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర అధిష్టానం నుంచి స్పష్టమైన దిశానిర్దేశం వచ్చినట్లు సమాచారం.గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సింగరేణి బెల్ట్‌ పరిధిలోని మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులలో మినహా మిగతా 8 చోట్ల పరాజయాన్ని మూట గట్టుకొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తరువాత పరిణామాల్లో టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ, ప్రజాభిప్రాయం భిన్నంగా ఉందనే విషయాన్ని బీజేపీ గుర్తించింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ద్వారా తన ప్రణాళికను అమలు చేసే ఆలోచనతో ఉంది. సింగరేణిలో ఎన్నికల్లో ఈసారి గుర్తింపు యూనియన్‌గా బీజేపీ అనుబంధ విభాగమైన బీఎంఎస్‌ను గెలిపించి కార్మిక క్షేత్రంలో పట్టునిలుపుకోవాలని ఆ పార్టీ నాయకులు కృత నిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి ఈబాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి సింగరేణి కోల్‌బెల్ట్‌ ఏరియా గులాబీదళానికి అండగా నిలిచింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి పరిధిలోని నియోజక వర్గాల్లో ఖమ్మం జిల్లాలో మినహా దాదాపు అంతటా టీఆర్‌ఎస్‌ జయకేతనం ఎగరేసింది. 2017లో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని తొలుత భావించినా, కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి ప్రణాళిక అమలు చేయడంతో భూపాలపల్లి, మందమర్రి మినహా అన్ని ఏరియాల్లో టీబీజీకేఎస్‌ ఘన విజయం సాధించింది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా సింగరేణి ప్రాంతం పరిధిలోని పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంటు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. దీంతో తమకు ఢోకా లేదని టిఆర్‌ఎస్‌ నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీగా గెలిచిన కవిత కూడా మళ్లీ రంగంలోకి దిగుతారని భావిస్తున్నారు.