సింగరేణి పక్షపాతిగా సిఎం కెసిఆర్‌

రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు

గత ప్రభుత్వాలు సింగరేణిని విస్మరించాయి

వ్యతిరేక విమర్శలతో సింగరేణికి నష్టం: బాల్క

గోదావరిఖని,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): సింగరేణిపై తప్పుడు ప్రచారంతో లబ్ది పొందానలుకేనే వారిపట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ సూచించారు. ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్న తరుణంలో…. సింగరేణిని మరింత ఉజ్వలంగా ముందుకు తీసుకుని వెళతామ న్నారు. సీఎం కేసీఆర్‌ సింగరేణి కార్మికుల పక్షపాతిగా ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు. శనివారం ఓసిపి-3లో ఆయన ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి ప్రత్యక్షంగా పరోక్షంగా చేరుతున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వస్తామన్నారు. సింగరేణి కార్మికుల కుటుంబాలకు సూపర్‌స్షెషాలిటీ వైద్య సదుపాయం అందుతుందని వివరించారు. గత 60 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాల కన్నా కెసిఆర్‌ చేపట్టిన ఆసరా పింఛన్లు, వడ్డీలేని రుణాలు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లాంటి పథకాలు దేశంలోనే గొప్పగా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాలు సింగరేణి సంస్థను విస్మరిస్తే కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరమే కార్మికుల సంక్షేమం, వారి హక్కుల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగారని గుర్తుచేశారు. కారుణ్య నియమాకాలతో పాటు తెలంగాణ ఇంక్రిమెంట్‌ అమలు, కార్మికుల సొంతింటి కలను సాకారం చేయడానికి రూ.10లక్షల రుణంపై వడ్డీని చెల్లించడం, కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పించామని వివరించారు. ఇంత చేసినా సీఎం కేసీఆర్‌ కార్మికుల కోసం ఏవిూ చేయలేదని విమర్శించడం హస్యాస్పదంగా ఉందన్నారు. పొరపాటున సింగరేణి కార్మికులు వ్యతిరేక విమర్శనలు నమ్మితే సింగరేణి కార్మికుల సంక్షేమం అధోగతే అవుతోందన్నారు. గతంలో సింగరేణి గనులపై కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావనీ, అసలు కార్మికులను పట్టించుకున్న పాపాన కూడా పోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ కార్మికులకు గనులపై క్యాంటీన్లు, యూనిఫాంలు, క్వార్టర్లకు ఏసీల బిగింపుతో ఆత్మగౌరవం నింపారన్నారు. దిగిపోయిన కార్మికులకు సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంతో కార్మికులకు రూ.10లక్షల వడ్డీ లేని రుణాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్‌ దవాఖానాలో మెరుగైన వైద్య సదుపాయాలుతోపాటు కారుణ్య నియామకాలు సాధించి సింగరేణి కార్మిక క్షేత్రం పురుడు పోసుకునేలా చేశారన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సింగరేణి అభివృద్ధి సాధ్యమవుతుందనీ, స్వరాష్ట్ర ఉద్యమంలో కార్మికులు ఏవిధంగానైతే కేసీఆర్‌కు అండగా నిలిచారో అదే ఉద్యమ పంథాతో ముందుకు సాగాల్సి ఉందన్నారు. నాడు స్వరాష్ట్రం కోసం కేసీఆర్‌ పోరాడి వస్తే.. సింగరేణి కార్మికులు ఊపిరి అందించి రాష్ట్ర సాధనలో ఆయనకు అండగా నిలిచారని, అలాంటి విూకు ఎంత చేసినా తక్కువే అని పేర్కొన్నారు. సింగరేణిపై కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉండడంతోనే సంస్థను అభివృద్ధిలోకి తీసుకవచ్చారని వివరించారు. గనులపై కార్మికులకు నాణ్యమైన అల్పాహారం అందించాలని క్యాంటీన్లను ఆధునీకరించారని తెలిపారు. జాతీయ సంఘాలు కార్మికుల వద్ద నుంచి చందాలు వసూలు చేస్తున్న ఆనవాయితీ ఉంటే.. మరి సింగరేణిలో టీబీజీకేఎస్‌ గెలవగానే కార్మికులు గుర్తింపు సంఘానికి చందా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని కేసీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెసోళ్లు నమ్మించి గొంతుకోస్తరనీ, అది ఆ పార్టీ నైజమని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఏనాడు సింగరేణి ప్రభావిత గ్రామాల సమస్యలను పరిష్కరించలేదని, అందువల్లే వారి సమస్యలు జఠిలమయ్యాయని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సింగరేణి ప్రభావిత గ్రామాల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించానని గుర్తు చేశారు.