సిద్దిపేట వైద్యకళాశాలలో అగ్నిప్రమాదం 

సిద్దిపేట, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : జిల్లా కేంద్రం సిద్దిపేటలోని వైద్యకళాశాలలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో రోగులు, వైద్య సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వైద్య కళాశాలలోని ఎంసీహెచ్‌ విభాగంలో శనివారం ఉదయం ఓ గదిలో విద్యుదాఘాతం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన గదిలో ఏడు ఆక్సిజన్‌ సిలిండర్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్‌ ఆస్పత్రిని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం, ఆస్తినష్టం జరగకపోవటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.