సినిమాలు,రాజకీయాలు రెండింటా బిజీ

సినీనటి, బీజేపీ నాయకురాలు భూక్య రేష్మారాథోడ్‌
మహబూబాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి):  ఇప్పటి వరకు తెలుగులో ఆరు, తమిళ, మళయాళంలో రెండు సినిమాలు చేసినట్లు సినీనటి, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ నాయకురాలు భూక్య రేష్మారాథోడ్‌ తెలిపారు. అవకాశాలు వచ్చిన వాటిలో మంచివి ఎన్నకుని ముందుకు సాగుతామని అన్నారు. అటు సినిమాలు చేస్తూనే ఇటు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నానని అన్నారు. ఇదిలావుంటే మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటానని అన్నారు. ఈ ప్రాంత ఆడబిడ్డగా ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉన్నదని అన్నారు.కాంగ్రెస్‌ పార్టీ అరవైయేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని, ముఖ్యంగా గిరిజన ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రిజర్వేషన్‌ల పేరుతో కాంగ్రెస్‌ నేతలు ¬దాలు అనుభవించారు తప్ప ప్రజల బాగోగులు ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆమె నియొజకవర్గంపై దీష్టి పెట్టారు.  కాంగ్రెస్‌ బస్సు యాత్ర పేరిట కల్లబోల్లి మాటలు చెబుతూ నాయకులు గ్రూప్‌షోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పెట్టిన బస్సుయాత్రల సభలో కార్యకర్తలు రావడం లేదని బతిమిలాడి మరీ తీసుకవచ్చి యాత్రలు జరపుతున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్‌ మూలంగానే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ రాకుండా ఇక్కడి యువత ఉపాధిని కొల్లగొట్టారని చెప్పారు.