సినీనటి అంజలి వచ్చేసింది!

నాలుగు రోజుల కిందట అదృశ్యమైన నటి అంజలి శుక్రవారం సాయంత్రం వెస్ట్‌ జోన్‌ డీసీసీ సుధీర్‌ బాబు ఎదుట హాజరవ్వడంతో అనేక మలుపులు తిరిగిన కథ సుఖాంతమైంది.
జనంసాక్షి : నాలుగు రోజుల కిందట అదృశ్యమైన సినీ నటి అంజలి శుక్రవారం సాయంత్రం వెస్ట్‌ డీసీసీ సుధీర్‌ బాబు ఎదుట హాజరవ్వడంతో అనేక ములుపులు తిరిగిన కథ సుఖాంతమైంది. శుక్రవారం ఆమె జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తన అదృశ్యంపై వివరణ ఇస్తారన్న సమాచారం రావటంతో మధ్యాహ్నం నుంచే మీడియా సైతం పోలీస్‌స్టేషన్‌ మందు ఉదయం నుంచే వేచివుంది. అయితే నాటకీయ ఫక్కీలో అర్థరాత్రి నటి అంజలి ఏపీ 28 ఏకే 3366 కారులో వెస్ట్‌ జోన్‌ పోలీసుల ఎదుట ప్రత్యక్షమైంది.
అంజలి విచారించిన తర్వాత వెస్ట్‌ జోన్‌ పోలీసులు అర్థరాత్రి మీడియా ముందు ప్రవేశపెట్టారు. తాను మీడియాతో మాట్లాడే పరిస్థితిలో ప్రస్తుతం లేనని..సోమవారం నుంచి బోల్‌ బచ్చన్‌ రీమేక్‌ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నానని అంజలి తెలిపింది. ఆ తర్వాత వెస్ట్‌ జోన్‌ డీసీపీ సుధీర్‌ బాబు మీడియాతో మాట్లాడారు. తన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ముంబై వెళ్లినట్టు అంజలి తెలిపిందని సుధీర్‌ బాబు తెలిపారు.
అంతకు ముందు అంజలి సోదరుడు రవిశంకర్ను శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫోన్‌ చేసి తన సోదరి గురించిన సమాచారంపై ఆరా తీశారు. అంజలి తనకు ఎలాంటి ఫోన్‌ కాల్‌ చేయలేదని, ఆమె ఎక్కడ ఉన్నారన్న విషయం తెలియటం లేదని ఆయన పోలీసులకు వివరించారు. అయితే అంజలి వ్యక్తిగత సెల్‌ఫోన్‌ ఇంకి స్విఛాఫ్‌ చేసే ఉన్నదని పోలీసులు తెలిపారు. ఆమె తన సోదరుడితో నెట్‌ఫోన్‌ ద్వారా మాట్టాడుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఆమె ఫోన్‌కాల్స్‌ను కూడా తెప్పించినట్లు తెలిపారు. ఇదిలావుండగా నటి అంజలి అదశ్యమైన అయిన రోజున ఆమె ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారో ఫోన్‌కాల్‌ లిస్ట్‌ను పోలీసులు తెప్పించారు. ఆ ఒక్క రోజే ఉదయం నుంచి అదృశ్యమైన క్షణం వరకు 22 ఫోన్లు వచ్చాయని వెల్లడైంది. ఔట్‌ గోయింగ్‌ లిస్టులో 9 ఫోన్‌ కాల్స్‌ ఉన్నట్లు తేలింది. అంజలి మిస్సింగ్‌ మిస్టరీ వీడటంతో పోలీసులకు ఊరట లభించింది.
ఇదిలా ఉండగా నటి అంజలి అదృశ్యం ఉదంతంపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని చెన్నై పోలీస్‌ కమిషనర్‌ జార్జ్‌కు మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన పిన్ని భారతీదేవిపై ఆరోపణలు చేసిన అంజలి ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌లో అదృశ్యమైన విషయం తెలిసిందే. అంజలిని ఎవిరో కిడ్నాప్‌ చేశారని, ఆమెను రక్షించాలని ఆమె పిన్ని భారతీదేవి చెన్నై పోలీసు కమిషనర్‌ జార్జ్‌ను ఆశ్రయించారు. ఆ మరుసటి రోజే హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. తన సోదరి కుమార్తె అంజలిని తాను దత్తత తీసుకున్నానని అందులో వివరించారు. ఆమె తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోందని, బలుపు చిత్రం షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లిన అంజలి అదృశ్యమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆచూకీ కనిపెట్టాలని పోలీసుల్ని ఆశ్రయించానని తెలిపారు.