సిబిఎస్‌ఇ సిలబస్‌ తగ్గింపు యోచన

సూచన ప్రాయంగా వెల్లడించిన జవదేకర్‌
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్‌ఇ సిలబస్‌లో 10 నుంచి 15శాతం మధ్య తగ్గే అవకాశం ఉందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు. ఈ విధంగా తగ్గించే కార్యక్రమం మూడేళ్లపాటు క్రమంగా చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌ వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో తగ్గుతుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఒకటో తరగతి నుండి 12వ తరగతి వరకు సిలబస్‌ను మరీ కఠినంగా లేకుండా మార్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మార్చబోయే సిలబస్‌కు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చి అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సిఇఆర్‌టి ) తుది మెరుగులు దిద్దుతోందన్నారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకంటరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలలకూ మార్చబోయే సిలబస్‌ వర్తిస్తుందని తెలిపారు. తమకు లక్షకు పైగా సూచనలు అందాయని, రాబోయే విద్యా సంవత్సరంలో 10 నుంచి 15 శాతం సిలబస్‌ తగ్గుతుందని ఆశిస్తున్నానని, ఆ మరుసటి ఏడాది మరికొంత తగ్గుతుందని మంత్రి స్పష్టంచేశారు.