సిసి కెమెరాలతో ఉత్సవాల పర్యవేక్షణ
పోలీసులకు సహకరించాలని వినతి
జగిత్యాల,ఆగస్ట్31 ( జనంసాక్షి): వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాఫీగా సాగేందుకు ఎస్పీ సింధూ శర్మ ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సమస్యాత్మక ప్రదేశాల్లో జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో గొడవలకు పాల్పడి కేసులున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. సీసీ కెమెరాలను ఠాణాలోని కంట్రోల్ రూముకు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించనున్నారు. సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పండుగలు నిర్వహించుకోవాలనీ, నిబంధనలకు లోబడి మండపాలు నిర్మించాలనీ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా నవరాత్రోత్సవాలు శాంతియుతంగా జరిగేందుకు జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకున్నది. జిల్లా వ్యాప్తంగా శాంతి కమిటీలు, గణెళిశ్ మండపాల నిర్వాహకులు, శాంతి కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నది. జగిత్యాల ఆర్డీవో , డీఎస్పీ సైతం మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి నిబంధనలతో కూడిన కరపత్రాలను అందించారు. ఉత్సవాలకు డీజేలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేదిలేదని పోలీసులు ఖరాకండిగా చెబుతున్నారు. డీజేలు వాడితే కేసులు తప్పవని పే ర్కొంటున్నారు. ఇదిలావుంటే భూమిపై మానవ మనుగడకు, పర్యావరణ హితానికి మొక్కలే ప్రాణాధారమని ఎస్పీ పేర్కొన్నారు. పర్యావరణ హితంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. మొక్కలు పెంచడం వల్ల చేకూరే ప్రయోజనాలను విద్యార్థులు అవగాహన కలిగి ఉండాన్నారు. మొక్కలు నాటడం చదువులో భాగం కావాలనీ, ఎంతో క్రమశిక్షణతో చదువుతారో అంతే క్రమశిక్షణతో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. వినాయక ఉత్సవాల్లో అది ప్రతిబింబించాలని అన్నారు. ఇదిలావుంటే గణెళిష్ నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించు కోవాలని అన్నారు. రెవెన్యూ, పోలీస్ ఆద్వర్యంలో గణెళిష్ మండపాల నిర్వాహకులు, పీస్ కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించి తగిన సూచనలు చేశారు. గణెళిష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా మండపాల నిర్వాహకులు నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకోవాలన్నారు. పండుగలు శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. మండప నిర్వాహకులు కరంటు సరఫరాకు కచ్చితంగా విద్యుత్ శాఖ నుంచి అనుమతి పొందాలన్నారు. వినాయక నవరాత్రోత్సవాల్లో ఒకరికొకరు సహకరించుకుంటూ పండుగలు నిర్వహించు కోవాలని జగిత్యాల ఎమ్మల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. మతసామరస్యానికి జగిత్యాల నిదర్శనంగా నిలవాలన్నారు. వినాయక చవితి ఉత్సవాలకు మున్సిపల్ తరపున చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి మండపానికి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకోవాలనీ, ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ నిర్ణయించిన ప్రకారం రుసుములు చెల్లించి విద్యు త్ కనెక్షన్లు తీసుకోవాలని తెలిపారు.