సీతాఫలం సీజన్‌ వస్తోంది

మూడు నెలలపాటు ఇక పండ్ల జాతర
జిల్లా నుంచి ఇతర రాష్టాల్రకు ఎగుమతి
జనగామ,అక్టోబర్‌7 జనం సాక్షి  ప్రకృతికి సిద్ధంగా లభించే అమృత ఫలాలు జనగామ మార్కెట్‌ నుంచి రోజు రాష్ట్ర సరిహద్దు దాటి వెళ్తుంటాయి. ఈ యేడాది వర్షాలు సవిూద్దిగా కురిసినా తగినన్ని చెట్లు లేకపోవడంతో సీతాఫలాలు ఆశించన మేర ఉత్పత్తి రాకపోవచ్చని అనుకుంటున్నారు. కూలీలకు ఉపాధిని కూడా కలిపిస్తూ ఈ వ్యాపారంలో ఇతర రాష్టాల్రకు జనగామకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఏడాదిలో మూడు నెలల పాటు అందుబాటులో ఉండే ఈ పండ్లు రోజువారీగా వేలాది కుటుంబాలలో వెలుగు నింపుతున్నాయి.  ఈ కాలంలో మూడు నెలలకు పైగా రాష్ట్రంలో అత్యధికంగా జనగామలో లభించే ఫలం సీతాఫలం దసరా సీజను నుంచి కాపుకొస్తుంది.  ప్రతీ సంవత్సరం సీతాఫలం కాలం వస్తే కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తుకు వస్తుంది. మార్కెట్‌లో ఎప్పుడు ఎప్పుడు కనిపిస్తాయో అనేలా ఎదురుచేసేలా చేస్తుంది. దక్షణ అమెరికా, ఐరోపా, ఆఫ్రిక దేశాలలో పెరిగే ఈ మొక్కలను మన దేశానికి తొలి సారిగా పోర్చుగీసు వారు 16వ శతాబ్ధంలో తీసుకువచ్చి ఇక్కడ మనకు లభ్యం అయ్యేలా మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారని చెబుతారు. మన రాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలు సీజన్‌లోనే లభిస్తాయి.  సీతాఫలం అమృత ఫలాన్ని తలపించే ఈ పండునే కస్టర్డ్‌ యాపిల్‌ పేరుతో పిలుస్తారు. ఇది దక్షణ అమెరికా దేశాలతో పాటు మన దేశంలోనూ విరివిగా లభిస్తాయి. చత్తీస్‌గఢ్‌ వాసులకు మాత్రం అద్భుత ఔషధఫలం. దీని ఆకులు, బెరడు, వేరుల అన్ని భాగాలను అక్కడ పలు వ్యాధుల నివారణలో వాడుతారు. మన దగ్గర కూడా చాలా మంది సెగ్గడాలకు వీటి ఆకులను చూర్ణం చేసి కడుతారు. పోషకాలతో పాటు పీచు పదార్థాలు  ఈ పండులో లభిస్తాయి. ఇంకా కెరోటిన్‌, థైమిన్‌, రిబోప్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-సీ వంటి విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఎదిగే పిల్లలకు రోజు ఒకటి లేదా రెండు పండ్లు తినిపిస్తే మంచిది.  తెలుగు రాష్టాల్రలో ఎక్కడ లేని విధంగా జనగామ జిల్లా ప్రాంతంలోని అడవుల్లో సీతాఫలం తోటలు ఎక్కువగా ఉన్నాయి. జనగామ, బచ్చన్నపేట, రఘునాథపల్లి, లింగాలఘనపురం, దేవరుప్పుల, తరిగొప్పుల, నర్మెట్ట, కొడకండ్ల, గుండాల తోపాటు యాదాద్రి జిల్లాలోని ఆలేరు, కొలనుపాక ప్రాంతాలలో విస్తరించిన అడవుల నుంచి కూలీలు మూడు నెలల పాటు ఈ పండ్లను సేకరిస్తారు. జనగామ సీతాఫలం మార్కెట్లకు తరలించి ఇతర రాష్టాల్రకు ఎగుమతి చేస్తుంటారు. సీజనల్‌గా లభించే సీతాఫలాలను జనగామ నుంచి ఇతర రాష్టాల్రకు ప్రతీ రోజు లారీల కొద్ది ఎగుమతి చేస్తుంటారు. హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల నుంచి కొనుగోలు దారులు వచ్చి తక్కువకు తీసుకుని వారు ఇతర ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తుంటారు.