సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్ 

దిల్లీ, ఏప్రిల్ 1(జనంసాక్షి): దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) తుది పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై విద్యార్థుల వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండా వారిని పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీబీఎస్ఈని ఆదేశించింది. ఇక 9 నుంచి 11 తరగతుల విద్యార్థులను అంతర్గంతంగా పాఠశాలలో నిర్వహించిన ప్రాజెక్టులు, పరీక్షల మార్కుల ఆధారంగా తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పోఖియాల్ నిశాంక్ తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు పై తరగతులకు ప్రమోట్ కాని విద్యార్థులు తర్వాత పాఠశాలలో నిర్వహించే ఆన్లైన్, ఆన్లైన్ పరీక్షలకు హాజరుకావచ్చని తెలిపారు. అయితే 10, 12 తరగతుల విద్యార్థులకు పై తరగతులకు వెళ్లేందుకు, ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో చేరేందుకు అవసరమైన 29 సబ్జెక్టుల్లో మాత్రం బోర్డు పరీక్షలు నిర్వహిస్తుందని మరో ప్రకటనలో తెలిపారు. అయితే పరిస్థితులను బట్టి ఈ పరీక్షల నిర్వహణ తేదీలను ముందుగా ప్రకటిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల విద్యాశాఖలు లాక్ డౌన్ కారణంగా 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను ఎటువంటి తుది పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 25 నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఇప్పటి వరకు భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1637కి చేరింది. వీరిలో 132 మంది వైరస్ బారి నుంచి బయటపడగా, 38 మంది మృత్యువాతపడ్డారు.