.సైఫ్‌ అయినా, సంజయ్‌ అయినా.. వదలం

` ప్రీతికి అన్యాయం చేసిన వాడిని శిక్షిస్తాం
` కేటీఆర్‌ హెచ్చరిక
జనగామ(జనంసాక్షి):పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి అన్యాయం చేసిన వాడు సైఫ్‌ అయినా, సంజయ్‌ అయినా.. ఎవడైనా సరే వదిలిపెట్టం.. చట్టపరంగా శిక్షిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ విషయంపై జిల్లా పర్యటనలో ఆయన ఘాటుగగా స్పందించారు.  స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో రూ. 125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. ప్రీతి ఆత్మహత్య విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలపై కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారు అని కేటీఆర్‌ మండిపడ్డారు. వరంగల్‌ ఎంజీఎంలో పీజీ చదువుతున్న డాక్టర్‌ ప్రీతి దురదృష్టావశాత్తూ కాలేజీలో జరిగిన గొడవల్లో మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అంశాన్ని కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం. మంత్రులు సత్యవతి రాథోడ్‌, దయాకర్‌ రావు, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, ఎంపీ కవిత వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ వేదిక నుంచి ప్రీతి కుటుంబానికి తమ పార్టీ, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా సంతాపం ప్రకటిస్తున్నాం. కొంత మంది రాజకీయంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ తాము ప్రభుత్వం, పార్టీ పరంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే.. వాడు సైఫ్‌ కావొచ్చు.. సంజయ్‌ కావొచ్చు.. ఇంకెవడైనా సరే.. వదిలిపెట్టం అని ఘాటుగా హెచ్చరించారు. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా శిక్ష వేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్నారు.  ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడం, చిల్లరమల్లర మాటలు మాట్లాడటం సరికాదని కేటీఆర్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.