స్కూటర్‌ను ఢీకొన్నలారీ :ఇద్దరు మృతి

రంగారెడ్డి,మే29(జ‌నం సాక్షి ): ఫరూఖ్‌నగర్‌ మండలం రాయికల్‌ టోల్‌ప్లాజా సవిూపంలో గల జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుడు పరమేష్‌(30) హైదరాబాద్‌లో నివసిస్తూ కూలీ పనిచేస్తున్నాడు. ఇదే జిల్లా కోడేరు మండలం బాడ్‌గదిన్నె గ్రామానికి చెందిన నర్సింహ కుమారుడు సురేష్‌(35) హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌ నుంచి ఇద్దరు కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు మంగళవారం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. టోల్‌ప్లాజా దాటిన తర్వాత న్యూమహారాజ దాబా సవిూపంలో తమిళనాడు రాష్ట్రానికి  చెందిన లారీ హైదరాబాద్‌ నుంచి తమిళనాడు వెళ్తూ వేగంగా ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టి వారిపై నుంచి వెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు చల్లాచదురయ్యాయి. పరమేష్‌కు భార్య ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. సురేష్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. మృతదేహాలను షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.