స్కూలు బస్సుకు ప్రమాదం: విద్యార్థులకు తప్పిన ముప్పు

నల్లగొండ,జూన్‌26(జ‌నం సాక్షి): ఘోర ప్రమాదం నుంచి చిన్నారులు బయటపడ్డ సంఘటన నల్లగొండ జిల్లా కనగల్‌ మండలంలో జరిగింది. కనగల్‌ మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చండూరులోగల గీతా విజ్ఞాన మందిరం పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం సాయంత్రం పాఠశాల అయిపోయిన తర్వాత విద్యార్థులను ఇళ్ల వద్ద వదిలేందుకు వెళ్తుండగా కుమ్మరిగూడెం సవిూపంలోని కల్వర్టు బ్రిడ్జి వద్ద స్కూల్‌ బస్సు వెనుక చక్రాలు విరిగిపోయాయి. ఆ సమయంలో బస్సులో ఇరవైమంది విద్యార్థులు ఉన్నారు. కాగా విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం వేరే బస్సులో విద్యార్థులను వారి ఇళ్ళకు పాఠశాల సిబ్బంది పంపారు. కండీషన్‌ లో లేని బస్సులను నడుపుతూ చిన్నారుల ప్రాణాలతో పాఠశాలల యాజమాన్యాలు చెలగాటమాడుతున్నా… అధికారులు ఏవిూ పట్టనట్లు ఉండడంపట్ల పలు విమర్శలొస్తున్నాయి. స్కూలు బస్సుల కండిషన్‌లో ఉండేలా చూడాలని కోరుతున్నారు.