స్కూలు బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

పలువురు విద్యార్థులకు గాయాలు

మేడ్చల్‌,జనవరి28(జ‌నంసాక్షి): మేడ్చల్‌లో ఆర్టీసీ బస్సు హల్‌చల్‌ చేసింది. స్కూల్‌ బస్సును-ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన సోమవారం ఉదయం మేడ్చల్‌ వద్ద చోటు చేసుకుంది. విద్యార్థులను పికప్‌ చేసుకుంటూ ఉదయం స్కూల్‌ బస్సు వెళుతుండగా, అత్యంత వేగంతో వచ్చిన ఆర్టీసీ బస్సు, స్కూల్‌ బస్సును డీకొంది. ప్రమాద సమయంలో స్కూల్‌ బస్సులో 28 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు గాయపడిన విద్యార్థులను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. స్థానికంగా ఉన్న గ్రామస్తులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనలో ఉన్న చిన్నారులను ధైర్యపరిచారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ బిడ్డల వద్దకు చేరుకుంటున్నారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.