స్వయం సహాయక సంఘాల ద్వారా.. 

తెలంగాణ మహిళల్లో ఎంతో మార్పు వచ్చింది
– సమాజాన్ని తీర్చిదిద్దే సమర్థత మహిళల్లో ఉంది
– 2104లో 20లక్షల స్వయం సహాయక బృందాలున్నాయి
– ఇప్పుడు దేశవ్యాప్తంగా 45లక్షలకు చేరాయి
– ‘ప్రధాన మంత్రి జన్‌సంవాద్‌’ కార్యక్రమంలో ప్రధాని మోడీ
– ఓరుగల్లు మహిళతో సంభాషించిన ప్రధాని
హైదరాబాద్‌, జులై21(జ‌నం సాక్షి) : స్వయం సహాయక సంఘాల ద్వారా తెలంగాణ మహిళల్లో ఎంత మార్పు వచ్చిందో చూడండి అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వివిధ వర్గాల ప్రజలను నేరుగా పలకరించేందుకు ‘ప్రధాన మంత్రి జన్‌సంవాద్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా పలు స్వయంసహాయక బృందాల మహిళలతో ప్రధాని మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన మహిళతో కూడా ఆయన సంభాషించారు.ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలానికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు కౌసర్‌ సాహెన్‌ బేగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌసర్‌ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, స్వయం సహాయక బృందంలో చేరడం పై ప్రధానితో పంచుకున్నారు. కాగా.. వరంగల్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న స్వయం సహాయక మహిళలందరూ ఏకరూపు దుస్తులు ధరించారు. దీని గురించి ప్రధాని వారిని ప్రశ్నించగా తమ కోసం యూనిఫాం ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. దీంతో ప్రధాని వారిని అభినందించారు. తెలంగాణ మహిళల్లో చాలా మార్పు వచ్చిందని, స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు పలువురికి స్ఫూర్తినిస్తున్నారని కొనియాడారు. గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధిలో ఈ సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని ప్రశంసించారు. 2014లో 20లక్షల స్వయం సహాయక బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. వాటి ద్వారా 2.25కోట్ల కుటుంబాలను ఈ బృందాల కిందకు తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పుడు అలాంటి బృందాలు 45లక్షలకు పైగా ఉన్నాయన్నారు. సమాజాన్ని తీర్చిదిద్దే సామర్థ్యం మహిళల్లో ఉందని ఈ సందర్భంగా ప్రధాని చెప్పుకొచ్చారు.