స.హ చట్టాన్ని.. మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది

– చట్టం ప్రతిపత్తిని దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది
– కేంద్రంతీరుపై ఆందోళన వ్యక్తం చేసిన సోనియాగాంధీ
న్యూఢిల్లీ, జులై23(జ‌నంసాక్షి) : సమాచార హక్కు చట్టాన్ని మోదీ సర్కార్‌ నిర్వీర్యం చేయాలని చూస్తోందని కాంగ్రెస్‌ నేత, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఆరోపించారు. ఈమేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. చట్టం ప్రతిపత్తిని దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతోందని విమర్శించారు. పదేళ్లలో 60లక్షల మంది సమాచారహక్కు(స.హ) చట్టాన్ని వినియోగించుకున్నారని గుర్తుచేశారు. భాజపా ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల చట్టం పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. సమాచార హక్కు చట్టం-2005ని సుదీర్ఘ చర్చలు, విస్తృత సంప్రదింపులతో రూపొందించామని వివరించారు. దీని ద్వారా ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని ఒక పీడగా భావిస్తోందని సోనియా ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌తో సమాన ¬దా కల్పించిన సమాచార
హక్కు కమిషనర్‌ విధుల్ని భాజపా ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. సంఖ్యాబలం ఉండడంతో భాజపా దీన్ని ఎలాగైనా సాధించాలని చూస్తోందన్నారు. ఈ క్రమంలో పౌరుల హక్కుల్ని హరిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోతున్నారన్నారు. సమాచార కమిషనర్లకు ప్రస్తుతం ఎన్నికల సంఘం
కమిషనర్లతో సమానమైన ¬దా ఉండగా దాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం సవరణలను ప్రతిపాదించింది. వారి
జీతభత్యాలు, సర్వీసు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడిగా రూపొందించనుంది. ఈ సవరణలను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. సమాచార కమిషన్‌ను కోరల్లేని పులిలా మార్చడానికే సవరణల బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించాయి. విపక్షాల విమర్శల మధ్య సమాచార హక్కు చట్టానికి చేసిన సవరణలను సోమవారం లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే.